నావికాస్థావరం నిర్వాసితుల పాదయాత్ర
రాంబిల్లి: విశాఖ జిల్లా రాంబిల్లి, ఎస్రాయవరం మండలాల్లో సుమారు 4,500 ఎకరాల్లో నిర్మిస్తున్న ప్రత్యామ్నాయ నావికా స్థావరం (ఎన్ఏఓబీ) ప్రాజెక్టులో నష్టపోయిన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రెండు వారాలకు పైగా ధర్నా నిర్వహిస్తున్న ఆందోళనకారులు సోమవారం ఉదయం యలమంచిలికి పాదయాత్రగా వెళ్లారు. కొత్తపట్నం, వాడనర్సాపురం మత్స్యకారులు, నేవీ కాలనీ, కొత్తపేట, చిన్న కలవాలపల్లె వాసులు సుమారు 3000 మందికి పైగా యలమంచిలి ఎన్ఏవోబీ భూసేకరణ కార్యాలయానికి పాదయాత్రగా తరలివెళ్లారు. పాదయాత్రలో సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి లోకనాథం, మత్స్యకార నాయకులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అనుసరించారు.